వెలుతురు సమస్యే ప్రమాదానికి కారణం : కేంద్రమంత్రి

by Thanuru Gopichand |

ఘటనపై లోతైన దర్యాప్తునకు ఆదేశం. రంగంలోకి దిగిన ఏఏఐబి.

వెలుతురు సమస్యే ప్రమాదానికి కారణం : కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajith Pawar) సహా ఐదుగురు మరణించడం దేశానికి తీరని లోటని కేంద్రమంత్రి పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనపై మంత్రి స్పందిస్తూ.. విమాన ల్యాండింగ్ సమయంలో ఎదురైన వెలుతురు సమస్యే (Poor Visibility) ప్రమాదానికి ప్రాథమిక కారణమని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. బారామతి ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలట్ తొలుత 'గో-అరౌండ్' చేశారని, రెండో ప్రయత్నంలో విమానం అదుపు తప్పి కూలిపోయిందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు. ఈ దుర్ఘటనపై ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ద్వారా పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఒకవేళ ప్రమాదానికి ఎవరైనా బాధ్యులని తేలితే వారిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంపై లోతైన అధ్యయనం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

Next Story