Kurnool: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి దేవ్ సిన్హా చౌహాన్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Kurnool: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి దేవ్ సిన్హా చౌహాన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ నిన్నమొన్నటి వరకు చెప్పుకొచ్చిన కేంద్రం తాజాగా మరో కొత్త పాట మొదలుపెట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానమేనని అంటోంది. ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర టెలి కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి దేవ్ సిన్హా చౌహాన్ ప్రత్యేక హోదాపై శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. హోదా అనేది కాంగ్రెస్ పార్టీ హామీ అని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకున్నా.. వివిధ పథకాలు, అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోడీ అత్యధిక నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కేంద్రమంత్రి దేవ్ సిన్హా చౌహాన్ పర్యటించారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పుకొచ్చారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. దేశంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. బడ్జెట్‌లో ఆదాయం లేకున్నా డబ్బులు పంచడంతో పంజాబ్ ఎదుర్కొన్న పరిస్థితులే కర్ణాటకలో రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేంద్ర టెలి కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి దేవ్ సిన్హా చౌహాన్ వ్యాఖ్యానించారు.



Next Story