పాతబస్తీలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే హఫీజ్

by Dishafeatures2 |
పాతబస్తీలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న ఎమ్మెల్యే హఫీజ్
X

దిశ, కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర పాతబస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్‌ను ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని హఫీజ్‌ను జీపులో ఎక్కించి తీసుకెళ్లారు. అంతకుముందు ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన లోకేష్‌ను ముందుగా మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలను తెలియజేశారు. జిల్లా కోర్టు భవనం వద్దకు పాదయాత్ర చేరుకోగా.. యువనేతను జిల్లా న్యాయవాదుల కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామిచ్చిన లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలుకు కేటాయించిన జ్యూడిషియల్ అకాడమీని జగన్ తరలించారన్నారు. హైకోర్టు ఏర్పాటు చేస్తామని నాలుగేళ్లుగా మోసం చేశారన్నారు. అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని సుప్రీం కోర్టులో వైసీపీ ప్రభుత్వం తెలిపిందని..విశాఖలో హైకోర్టు అని మంత్రి బుగ్గన చెప్పారన్నారు. జగన్ మాయ మాటలు విని మోసపోయామని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేష్ మాట్లాడుతూ.. జగన్ లా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ తమది కాదన్నారు. బెంచ్ కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. 50వ డివిజన్ టిడ్కో బాధితులు యువనేత లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ డివిజన్‌లో 1200 మంది గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లకోసం రూ.లక్ష చొప్పున చెల్లించామని..ఇంతవరకు ఇళ్లను పూర్తిచేసి ఇవ్వలేదన్నారు. వార్డుల్లో మంచినీరు సరిగా రావడంలేదని..నీటి సమస్య ఇబ్బందిగా ఉందన్నారు. బీసీ కార్పొరేషన్‌లో లోన్లు తీసుకున్న 18 మంది రజకులు లోన్లు క్లియర్ చేస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. 50వ వార్డులో పార్కు, లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. తమ వార్డులో విద్యుత్ స్థంభాలు, విద్యుత్, డ్రైనేజీ సమస్యలున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి చొరవచూపాలని యువనేతను కోరారు. అందుకు స్పందించిన లోకేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతానికి పైగా పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను, మిగిలిన పనులు పూర్తి చేసి ఇవ్వకుండా సైకో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. పట్టణాలు, నగరాల్లో పన్నుల బాదుడుపై ఉన్న శ్రద్ద, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంపై లేదన్నారు. టీడీపీ అధికారంలోకొచ్చాక 50వ డివిజన్ లో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 50వ డివిజన్‌లో ఖాళీ స్థలాలు గుర్తించి పార్కు, లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామిచ్చారు.

ఆర్యవైశ్యులకు అండగా టీడీపీ : లోకేష్

ఆర్యవైశ్యులకు టీడీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో భాగంగా శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మ వారి శాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ము ఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ రోశయ్యకు ప్రతి పుట్టిన రోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాన్ని అని..రాజకీయాలకు అతీతంగా రోశయ్య పని చేశారని కొనియాడారు. రోశయ్య మృతి చెందినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదన్నారు. రోశయ్య కాంగ్రెస్ అయినా తమకు ఆయనంటే గౌరవం ఉందని తెలిపారు. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తామని..మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన సేవల తాలూకా ఆనవాళ్లు మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య పెద్ద వాదనలు జరిగినప్పుడు రోశయ్య సంధాన కర్తగా ఉండేవారని గుర్తు చేశారు. రోశయ్య సీఎం అయ్యాక చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారన్నారు. రోశయ్య ఛనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయిందన్నారు. ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మారాక కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తామన్నారు. పేదరికానికి కులం, మతం ఉండదని ఆయన తెలిపారు. కొన్ని కులాలతో పాటు ఆర్యవైశ్యులకు వైసీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు.

ఆ కులాల పట్ల వైసీపీకి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు కూడా బయటకు వచ్చి తాము కూడా ఈ ప్రభుత్వంలో బాధితులమే అని వాపోతున్నారన్నారు. అందరిలో చైతన్యం రావాలని..ఒక్కరిపై కేసు పెడతారు..వెయ్యి మందిపై పెడతారా..? అని ప్రశ్నించారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నదని..అమర్ రాజా ఎక్కువ పన్ను చెల్లిస్తుందని..అలాంటి కంపెనీని తెలంగాణకు తరిమారని మండిపడ్డారు. కర్నూలులో 1000 మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని..నాలుగేళ్లుగా సోలార్ ప్లాంట్‌పై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, షాపుల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తగ్గించాలన్నారు. ఆర్యవైశ్యులను రాజ్యసభకు పంపింది టీడీపీనే అని గుర్తు చేశారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించి ఆర్యవైశ్యులకి రక్షణ కల్పిస్తామని హామిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి టీజీ భరత్, టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed