Byreddy: రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోం!

by Disha Web Desk 16 |
Byreddy: రాయలసీమకు అన్యాయం చేస్తే ఊరుకోం!
X

దిశ, కర్నూలు ప్రతినిధి: దేశానికి 75 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాయలసీమకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని, ఇంకా రాయలసీమకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేదిలేదని, సీమ వాసులను సమీకరించి ఉద్యమాలను ఉధృతం చేస్తామని రాయలసీమ స్టీరింగ్ కమిటీ, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల సూరజ్ హోటల్‌లో ఉమ్మడి నాలుగు జిల్లాల రాయలసీమ స్టీరింగ్ కమిటీ నేతలతో నిర్వహించిన విసృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి సమస్యను పరిష్కరించడంలో నేతలు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు రాళ్లు, చెప్పులు విసురుకోవడానికి, సీట్ల కోసం పకులాడుతున్నారే తప్ప రాయలసీమ రైతాంగానికి అవసరమైన నీటి గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సీమలో ఐరన్ ఓర్, సున్నపు గనులు, బంగారు గనులు, వర్షాలు వస్తే వజ్రాలు, అటవీ సంపద, ఎర్ర చందనం అన్ని పుష్కలంగా లభిస్తున్నాయని, అలాగే అన్ని ప్రముఖ దేవాలయాలున్నాయన్నారు. అయితే నీటి సమస్య తీర్చకపోవడంతో వలసలు, నిరుద్యోగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీగల వంతెన ఏర్పాటు చేసి రైతుల గొంతులకు ఉరి వేస్తారా ? అని ప్రశ్నించారు.

రాయలసీమ రైతులను దృష్టిలో ఉంచుకుని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జీ కమ్ బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ కోసం గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేయాలని, వేదవతి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయడంలేదని

ప్రశ్నించారు. కర్నాటక ప్రభుత్వం అప్పర్ భద్ర ప్రాజెక్టు కడితే కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల ప్రాంతాలు కరువుతో నాశనమౌతాయన్నారు. నంద్యాలలో చక్కెర ఫ్యాక్టరీ మూతపడి రియల్ ఎస్టేట్ గా మారిపోయిందని ఆయన గుర్తు చేశారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని రాయసీమకు న్యాయం చేకూరాలనే ఉద్దేశంతో ఈ నెల 24 న కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిరసన దీక్ష పడుతున్నట్లు ప్రకటించారు. అందరూ సహకరించాలన్నారు. ఆ తర్వాత సంతకల సేకరణ చేపట్టి ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. సీమకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు కళ్లు తెరిచి అప్పర్ భద్ర ప్రాజెక్టును అడ్డుకోవాలని, తీగల వంతెనకు బదులు సంగమేశ్వరం వద్ద కృష్ణానదిపై బ్రిడ్జీ కమ్ బ్యారేజ్ వచ్చేందుకు కృషి చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు.

Next Story

Most Viewed