- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి, భవానీ దీక్షా విరమణకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. నవంబరులో ప్రారంభమైన భవానీ మండల దీక్షలు ముగింపు దశకు చేరుకుంటుండటంతో, డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే దీక్షా విరమణ మహోత్సవానికి ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గ గుడి చరిత్రలో అత్యంత కీలకమైన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సుమారు 6 లక్షల మందికి పైగా భవానీ దీక్షాదారులు తరలివచ్చే అవకాశం ఉందని పాలకమండలి సభ్యులు అంచనా వేస్తున్నారు.
భక్తుల కోసం ఏర్పాట్లు
దీక్షా విరమణ కోసం భక్తులు నెయ్యి కొబ్బరికాయలను సమర్పించేందుకు వీలుగా మూడు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, మొబైల్ టాయిలెట్లు, ప్రథమ చికిత్స కేంద్రాలను అందుబాటులో ఉంచనున్నారు. దీక్షా విరమణలో భాగంగా తలనీలాలు సమర్పించే భక్తుల కోసం దాదాపు 850 మందికి పైగా క్షురకులతో కేశఖండన శాలలు (క్షవరశాల) సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రద్దీని నియంత్రించడానికి, భద్రతను పర్యవేక్షించడానికి పోలీసులు, దేవస్థానం సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారన్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీక్షా విరమణ చివరి రోజు, డిసెంబర్ 15న మహా పూర్ణాహుతితో ఈ ఐదు రోజుల ఉత్సవం ముగుస్తుందని, భవానీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
భక్తులు సంతృప్తి చెందేలా దర్శనం ఏర్పాట్లు
భవనా దీక్షల విరమణ సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయం వద్ద జరుగున్న ఏర్పాట్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పరిశీలించారు. భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి, అధికారులకు సూచించారు. 2028లో కృష్ణా నదికి రాబోయే పుష్కరాల సందర్భంగా ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వెయిటింగ్ హాల్స్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పుష్కరాల నిర్వహణ, ఆలయ అభివృద్ధిపై సమావేశం నిర్వహిస్తామన్నారు. సంబంధిత పనుల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. పుష్కరాల సమయానికి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. ఎంపీతో పాటు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ ఈవో శీనా నాయక్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తదితరులున్నారు.






