YCP: పవన్ వారాహి తొలి రోజు టూర్ అట్టర్ ఫ్లాప్..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-15 14:31:52  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిరోజు వారాహి విజయయాత్ర టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. .

YCP: పవన్ వారాహి తొలి రోజు టూర్ అట్టర్ ఫ్లాప్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిరోజు వారాహి విజయయాత్ర టూర్ అట్టర్ ఫ్లాప్ అయిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. పవన్ కల్యాణ్ సభకు జనం కరువయ్యారని చెప్పారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దగ్గర అవుతుండటంతోనే జన సైనికులు దూరమయ్యారని...నిన్నటి కార్యక్రమంతో ఆ విషయం తేటతెల్లమైందని విమర్శించారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో కూడా పవన్‌కు తెలియడం లేదని మండిపడ్డారు.


విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే ముందు స్థాయి తెలుసుకుంటే మంచిదని ఎమ్మెల్యే సూచించారు. పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయిన ఉత్తర కుమార ప్రగల్భాలను పవన్ నేటికీ మానుకోలేదని అన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాల్లో స్థిరత్వం లేదని అన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో..ఏ ఎన్నికలకు ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తారో కూడా తెలియదని పేర్కొన్నారు. 2018–19 మధ్య తెలుగుదేశాన్ని, నారా లోకేశ్‌ను, కేంద్రంలోని బీజేపీని పవన్ తిట్టినన్ని తిట్లు ఎవరూ తిట్టలేదని తెలిపారు. ఇప్పుడు మళ్లీ వారితో కలిసి ప్రయాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు మంచి చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీతో పాటు బీజేపీతో దోస్తీ చేసిన పవన్.. చంద్రబాబు పాలనలో జరిగిన దుర్మార్గాలు, హత్యలు, మారణహోమాలపై ఎందుకు మాట్లాడలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర ప్రజలంతా జగన్‌ వెంటే ఉన్నారన్న అక్కసు పవన్ వ్యాఖ్యల్లో తేటతెల్లమైందని వెల్లడించారు. వారాహి టూర్‌లో జనసేన అధినేత చేసిన దిగజారుడు విమర్శలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

Ap News: ఎన్నికల మూడ్‌లోకి పవన్... జనసేన నేతల్లో హర్షం

Next Story