Gudivada: చంద్రబాబు, లోకేశ్‌కు కొడాలి నాని సవాల్

by Disha Web Desk 16 |
Gudivada: చంద్రబాబు, లోకేశ్‌కు కొడాలి నాని సవాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేసి పార్టీని లాక్కున్నాడని విరుచుకుపడ్డారు. మళ్లీ ఇప్పుడు గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారని మాజీమంత్రి కొడాలి నాని ఆరోపించారు.

గుడివాడలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ బతికి బట్టకట్టాలంటే అది నందమూరి వారసుల వల్లే సాధ్యమని అన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొట్టి.. ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకునే రోజులు అతి తొందర్లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మహానాడుపై తీవ్ర విమర్శలు చేశారు.

స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమహేంద్రవరంలో మహానాడు సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేశ్‌కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదు అని మాజీమంత్రి కొడాలి నాని హెచ్చరించారు.


Next Story

Most Viewed