ప్రజల ఆస్తుల లూటీ.. రేపటి నుంచి సీపీఎం పోరుబాట

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బీజేపీ పంచన చేరాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు..

ప్రజల ఆస్తుల లూటీ.. రేపటి నుంచి సీపీఎం పోరుబాట
X

దిశ‌, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వైసీపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైందని, అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ బీజేపీ పంచన చేరాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలకు మేలు జరగలేదని, సహజ వనరులు, ప్రజల ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పాలన 12 ఏళ్లు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం కనిపిస్తోందని, పెట్టుబడుల పేరుతో భూములు, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో

స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో రాష్ట్రాన్ని విషాద ఆంధ్రప్రదేశ్‌గా మార్చిందని విమర్శించారు. పరీక్షా పత్రాల లీకేజీలు, నిరుద్యోగ సమస్యలపై యువతలో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. మత రాజకీయాలతో ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని, బీచ్‌లలో బార్‌ల ఏర్పాటును సీపీఎం వ్యతిరేకిస్తుందని ఆయ‌న స్పష్టం చేశారు.

9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో..

కోనసీమ గ్యాస్, ఇతర సహజ వనరులు పెద్ద కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని ఆరోపించిన శ్రీనివాసరావు, ఇటీవల గ్యాస్ ధరల పెంపును కూడా ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంగా వైసీపీ సమర్థవంతంగా వ్యవహరించడం లేదని, కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తూనే రాష్ట్రంలో విమర్శలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వామపక్ష భావజాలానికి ఆదరణ పెరుగుతోందని ఆయ‌న పేర్కొన్నారు.

Next Story