కాకినాడపై పవన్ ఫోకస్... డివిజన్ల వారీగా కార్యకర్తలకు కీలక సూచనలు

by Vemula.Srinu Prasad |

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం కాకినాడలో పర్యటిస్తున్నారు....

కాకినాడపై పవన్ ఫోకస్... డివిజన్ల వారీగా కార్యకర్తలకు కీలక సూచనలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలో భాగంగా శుక్రవారం కాకినాడలో పర్యటిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో డివిజన్ల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కో డివిజన్‌లో 20 మందితో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో జనసేన పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తుండటంతో కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని, అటు టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని పవన్ కల్యాణ్ సూచిస్తున్నారు.

మరోవైపు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిని ఓడిస్తానని పవన్ కల్యాణ్ వారాహియాత్రలో సవాల్ చేశారు. అటు ద్వారం పూడి కూడా కాకినాడ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని, ఇందుకు ఎంత దూరమైనా వెళ్తానని ప్రతి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడలో వైసీపీ బలం, బలహీనతపై జనసేన కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ద్వారంపూడి వైఫల్యాలపై ఇక నుంచి పోరాటం మరింతగా చేయాలని కార్యకర్తలకు సూచించినట్లు తెలుస్తోంది.

కాగా టీడీపీ పొత్తుతో ఎన్నికలకు వెళ్తామని గతంలో పవన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులను బట్టి వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన జిల్లాల బాట పట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా కాకినాడ నియోజకవర్గం జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.

Next Story