ఈ రెండు సీట్లు ఎవరివో.. పట్టుబడుతున్న జనసేన, బీజేపీ

by Disha Web Desk 2 |
ఈ రెండు సీట్లు ఎవరివో.. పట్టుబడుతున్న జనసేన, బీజేపీ
X

దిశ, ప్రతినిధి కడప: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొత్తు చర్చలు వేడెక్కుతున్నాయి. జగన్ సొంత జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఏ మేరకు సాధ్యమవుతుందన్న అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. ఈ రెండు పార్టీలకు తెలుగుదేశం పార్టీ చెరొక చోట సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉంటుందని భావిస్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు మాత్రం బీజేపీ, జనసేన అడిగే జమ్మలమడుగు, రాజంపేట స్థానాల నుంచి టీడీపీనే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లాలో పొత్తులో సీట్ల సర్దుబాటు వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజంపేట ఎవరికోట?

రాజకీయ ప్రత్యేకత సంతరించుకున్న ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి టీడీపీ, వైసీపీ మధ్య ఒకటి రెండు చోట్ల తప్ప హోరాహోరీ పోరు సాగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. చాలాచోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి వస్తుందన్న ధీమాతో విజయ అవకాశాలు లెక్కేస్తూ పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బిజెపి, జనసేనతో పొత్తు పెట్టుకోవడం, వీరికి సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కడప జిల్లాలో రాజంపేట సీటును జనసేన, తెలుగుదేశం కంచుకోట అయిన జమ్మలమడుగు అసెంబ్లీ సీటును తమకు కేటాయించాలని బీజేపీ గట్టిగా పట్టుబడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కూడా చంద్రబాబు కోరిన టికెట్లలో రాజంపేట కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇక్కడి నుంచి తెలుగుదేశమే పోటీ చేయాలని ఆ పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నారు. పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న చెంగల్ రాయుడుతో పాటు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు, మరో నాయకుడు నరహరి టికెట్ల బరిలో ఉన్నారు.

నాటి కంచుకోట వదలుకుంటారా!

రాజంపేట జనసేన కోరుకుంటుండగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2004 వరకు ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న జమ్మలమడుగును బీజేపీ కోరుకుంటోంది. జమ్మలమడుగులో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో తెలుగుదేశం ఉంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల అనంతరం టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో అక్కడ ఆయన అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించింది. దీంతో భూపేష్ రెడ్డి నాటి నుంచి నేటి వరకు జనం మధ్యలో జోరుగా తిరుగుతూ పార్టీ పటిష్టం వైపు అడుగులు వేస్తూ వచ్చారు. జమ్మలమడుగు టిక్కెట్టును బీజేపీ తరపున మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆశిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమలం నుంచి బాబాయి ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం నుంచి అబ్బాయి భూపేష్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధపడటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.



Next Story