జగ్గన్న ప్రభలతీర్థానికి 400 ఏళ్ల చరిత్ర : సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా.

జగ్గన్న ప్రభలతీర్థానికి 400 ఏళ్ల చరిత్ర : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : కోనసీమ (Konaseema) సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమైన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని (Prabhala Teertham) రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. ప్రతి ఏడాది అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారులోని జగ్గన్నతోటలో జరిగే ఈ వేడుకలకు రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ ప్రాముఖ్యం ఉంది. కోనసీమ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లినవారు ప్రతి ఏడాది తప్పనిసరిగా ప్రభలతీర్థం ఉత్సవాలకు హాజరవుతారు. జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. కోనసీమ చుట్టుపక్కనున్న 11 గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటారు.

దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. జగ్గన్న ప్రభలతీర్థానికి 400ల ఏళ్ల చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఇదొక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకని తెలిపారు. ప్రతి ఏడాది కనుమరోజు జగ్గన్న తోటలో ఈ పండుగ జరుగుతుందన్నారు. ఇందులో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనం ఇస్తాయన్నారు. తరతరాలుగా సంప్రదాయాన్ని కోనసీమ ప్రజలు కాపాడుతూ వస్తున్నారని తెలిపారు. వారి భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూ జగ్గన్నతోట ప్రభలతీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది ఉత్సవానికి హాజరవుతారని పేర్కొన్నారు. మంత్రివర్గం నిర్ణయం మేరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని ప్రకటించారు. కేబినెట్ నిర్ణయం కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story