బహ్రెయిన్‌లో ఇరాన్ భీకర దాడులు... తెలుగు వారి పరిస్థితిపై స్పీకర్ అయ్యన్న ఆరా

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-01 08:56:36  IST  )

ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయిల్, అమెరికాకు మద్దతు తెలిపిన దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ..

బహ్రెయిన్‌లో ఇరాన్ భీకర దాడులు... తెలుగు వారి పరిస్థితిపై స్పీకర్ అయ్యన్న ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌(Iran)పై ఇజ్రాయిల్(Israel), అమెరికా(America) దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయిల్, అమెరికాకు మద్దతు తెలిపిన దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. తాజాగా బహ్రెయిన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దేశంలో తెలుగువాళ్లు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన 50 వేల మంది తెలుగు వాళ్లు బహ్రెయిన్‌లో నివసిస్తున్నారు. యూఎస్ నేవీ బేస్‌కు పది కిలో మీటర్ల దూరంలో ఏపీ ప్రజలు ఉంటున్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం రాష్ట్రం నుంచి వెళ్లి అక్కడ నివసిస్తున్నారు. మరో పది రోజుల పాటు బహ్రెయిన్‌‌పై ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో అక్కడ చిక్కుకున్న వారి కోసం రాష్ట్రంలోని వాళ్ల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని సురక్షింతంగా రాష్ట్రానికి తరలించాలని వేడుకుంటున్నారు.

బహ్రెయిన్‌లో తెలుగువారి యోగక్షేమాలపై అయ్యన్న ఆరా

ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహ్రెయిన్‌లోని ప్రవాస తెలుగువారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇరాన్ దాడులు చేస్తున్న తరుణంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. ఏపీకి చెందిన సుమారు 50 వేల మంది అక్కడ వివిధ ఉద్యోగాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో బహ్రెయిన్‌లో ఉంటున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం వెళ్లి అక్కడే స్థిరపడ్డారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఎన్నారై శెట్టి సతీశ్ కు తాను ఫోన్ చేశానని, బహ్రెయిన్‌లో తెలుగువారి యోగక్షేమాలపై అడిగి తెలుసుకున్నానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అక్కడ ఉన్న తెలుగు వాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఏపీఎన్ ఆర్టీ ద్వారా సహాయం చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని తెలిపారు. అవసరమైతే స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ మాట్లాడి చర్యలు తీసుకుంటామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు.

Next Story