- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాణాత్మకంగా పెట్టుబడుల సదస్సు : ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు (Investments Meet) నిర్మాణాత్మకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు (Investments Meet) నిర్మాణాత్మకంగా జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజంటేషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాల రూపాల్లో రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక అంశాలపైన కూడా అధ్యయనం ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వీఆర్ఓల వరకు బాధ్యతగా పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అసలు సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదో బాధితుడికి అర్థమయ్యేలా తెలిపే విధానం తెస్తామన్నారు. పరిష్కారం కాని సమస్యలకు గల సాంకేతిక కారణాలను తెలియజేస్తామన్నారు. అవినీతి నిర్మూలన, పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామన్నారు.
జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంది
రాష్ట్రంలోని కొన్ని సున్నితమైన అంశాలను జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల పరిష్కారానికి విధిగా ప్రజా దర్బార్ (Prajaa Darbar)లు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోం అంటే కుదరదన్నారు. లోకేష్ ఆదేశాల తర్వాత ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చిందని పేర్కొన్నారు. తన దాకా వస్తేనే సమస్య పరిష్కారమవుతుందనే భావన ఉండొద్దన్నారు. ఏ సమస్య అయినా ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. 22ఏ నిషేధిత జాబితా భూముల అంశంపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
క్రియాశీలకంగా లోకేష్
పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎంతో కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఒప్పందాలు పెట్టుబడుల సదస్సుకు సంబంధం లేకుండా దేనికదే విడివిడాగా జరుగుతాయన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ (Quantum Computer) ఇప్పటికే సిద్ధమైందని.. దాని షిప్మెంటే ఆలస్యమని తెలియజేశారు. నిర్ణీత సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
అది శుభపరిణామం
తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ ఏపీ వైపు చూస్తోందని.. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో (Naidupeta) రూ.6వేల కోట్ల వరకు పెట్టుబడులను పెట్టనుండడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం
డిసెంబర్ చివరి నాటికి టీడీపీ పార్టీ (TDP) కమిటీలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు వీలైనన్ని కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ కమిటీల మీద కసరత్తు జరుగుతుందని తెలిపారు. కమిటీలన్నీ పూర్తయిన తరువాత పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని ప్రకటించారు.






