డిజిటల్ ఇన్ఫ్రాలో బలమైన స్థానంలోకి భారత్

by Thanuru Gopichand |

ప్రస్తుతం ప్రపంచాన్ని డిజిటల్ వ్యవస్థ శాసిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్ ఆ వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతోంది.

డిజిటల్ ఇన్ఫ్రాలో బలమైన స్థానంలోకి భారత్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచాన్ని డిజిటల్ వ్యవస్థ శాసిస్తోందనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్ ఆ వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యుసీ (PWC) తన తాజా నివేదికలో వెల్లడించింది. భారత దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు (Digital Infrastructure) మునుపెన్నడూ లేని విధంగా బలపడుతున్నాయని, ఇది రాబోయే కాలంలో దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముకగా నిలవనుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా డేటా సెంటర్ల సామర్థ్యం భారీగా పెరుగుతోందని తెలిపింది. ప్రస్తుతం 1.5 గిగావాట్లుగా ఉన్న ఈ సామర్థ్యం 2035 నాటికి 14 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది దాదాపు 20-24 శాతం వార్షిక వృద్ధి రేటును (CAGR) సూచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, 5G సేవల విస్తరణ వల్ల డేటా వినియోగం విపరీతంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణమని పీడబ్ల్యుసీ విశ్లేషించింది.

భారతదేశం కేవలం తన అవసరాలకే కాకుండా, ప్రపంచ దేశాలకు డిజిటల్ హబ్‌గా మారే అవకాశం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది. 'డేటా ఎంబసీలు' (Data Embassies), 'డేటా సిటీలు' (Data Cities) వంటి వినూత్న నమూనాలను ప్రవేశపెట్టడం ద్వారా అంతర్జాతీయ సంస్థలు, ఇతర దేశాల సార్వభౌమ డేటాను భద్రపరిచే విశ్వసనీయ కేంద్రంగా భారత్ అవతరించవచ్చని పేర్కొంది. దీనివల్ల విదేశీ పెట్టుబడులు ప్రవాహం పెరగడమే కాకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. సింగపూర్, మలేషియా వంటి దేశాలతో పోలిస్తే డేటా సెంటర్ల నిర్మాణ వ్యయం భారత్‌లో తక్కువగా ఉండటం, పునరుత్పాదక ఇంధన వనరులు (Clean Power) పుష్కలంగా అందుబాటులో ఉండటం దేశానికి అదనపు బలంగా మారుతుందని నివేదిక స్పష్టం చేసింది.

డిజిటల్ విప్లవం కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా.. దేశ జీడీపీలో గణనీయమైన వాటాను ఆక్రమిస్తోంది. పీడబ్ల్యుసీ గణాంకాల ప్రకారం భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 402 బిలియన్ డాలర్ల (జీడీపీలో 11.74 శాతం) సహకారాన్ని అందించగా, ఇది 2029-30 నాటికి జాతీయ ఆదాయంలో 20 శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇది వ్యవసాయం, ఉత్పాదక రంగాల వాటా కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం పారదర్శకమైన పన్ను విధానాలను, స్థిరమైన నియంత్రణ చట్రాన్ని (Regulatory Framework), సైబర్ భద్రతకు పటిష్టమైన హామీలను అందించాల్సిన అవసరం ఉందని పీడబ్ల్యుసీ తన నివేదికలో సూచించింది.

Next Story