చంద్రబాబు నీతిమంతుడైతే జైలుకెందుకెళ్లారు: మంత్రి బొత్స సత్యనారాయణ

by Disha Web Desk 21 |
చంద్రబాబు నీతిమంతుడైతే జైలుకెందుకెళ్లారు: మంత్రి బొత్స సత్యనారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికర బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వైసీపీ పాలనలో సముచిత స్థానం లభించిందని అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలు అన్ని రంగాల్లో బలోపేతం అవ్వాలనే లక్ష్యంతో వారికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్‌ పాలనలో జరిగిన సామాజిక సాధికారతను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు నీతిమంతుడు... నిజాయితీపరుడైతే 50 రోజులు జైల్లో ఎందుకు ఉన్నారని నిలదీశారు. స్కిల్‌ స్కామ్‌లో సాక్ష్యాధారాలు ఉన్నందునే చంద్రబాబును న్యాయస్థానం రిమాండ్‌ విధించిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డా.బి.ఆర్ అంబేద్కర్, పూలే ఆశయాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. కేబినెట్‌తో పాటు నామినేట్‌ పదవుల్లోనూ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అగ్రతాంబూలం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సామాజిక సాధికర బస్సుయాత్రపై ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ కథనాలను నమ్మవద్దు అని మంత్రి బొత్స సూచించారు. వైసీపీ పాలనలో ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed