ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

by Disha Web Desk 2 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకులోయ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అరకులోయ మండలం, నందివలస గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న జాతరకు వెళుతున్న బైకులు ఒకదానికి ఒకటి ఢీకొండంతో ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, అరకులోయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. మరో యువకుడు కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు.

మృతులు చినలబుడు గ్రామానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13), సింహాద్రి (28), లోతేరు గ్రామానికి చెందిన త్రినాద్ (32), భార్గవ్ (4)లుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరిలో తీవ్రగాయాలైన మరో నలుగురిలో విశాఖ కేజీహెచ్‌లో ఇద్దరు, మరో ఇద్దరు అరకులోయ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహా శివరాత్రి పర్వదినాన ప్రమాదం చోటు చేసుకోవడం ఐదుగురు మృతి చెందడంతో అరకులోయ పరిసర ప్రాంతాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.



Next Story