అమరావతికి భారీ గుడ్ న్యూస్... కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-10 09:18:45  IST  )

ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati)పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం నిర్మించేందుకు సిద్ధమైంది..

అమరావతికి భారీ గుడ్ న్యూస్... కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Central Government Employees) కోసం భారీ నివాస సముదాయాన్ని(Residential Complex) నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రూ. 2534 కోట్లను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్(Union Cabinet) అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇందులో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ. 1299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ. 1234,91 కేట్లను కేటాయించింది. ఈ నిధుల విడుదలతో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు మరింత ఊపు రానుంది.

ఒకే చోట అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు

ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకే చోట అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరేలా ప్రణాళికలు రూపొందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ కార్యాలయాలన్నింటినీ ఒకే కాంప్లెక్స్‌లో, చతురస్రాకారంలో నిర్మించనున్నారు. దీనివల్ల వివిధ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు, ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వ సేవలు ఒకే చోట సులభంగా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నిర్మాణాల కోసం 22.53 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించింది. ఇందులో సెంట్రల్ సెక్రటేరియట్ కోసం 5.53 ఎకరాలు, మిగిలిన 17 ఎకరాల్లో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయం కోసం భూమిని రెడీ చేసింది.

మరోసారి పెద్దపీట వేయడంపై హర్షం

రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో మరోసారి పెద్దపీట వేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. విభజన హామీల అమలుతో పాటు ఏపీ అభివృద్ధికి కేంద్రం నిరంతరం అండగా నిలుస్తుందనడానికి ఈ నిర్ణయమే నిదర్శనమని రాష్ట్ర అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ భారీ కేటాయింపులు అమరావతి ప్రాంత రూపురేఖలను మార్చడమే కాకుండా, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

Next Story