శ్రీ గంగానమ్మ తల్లిని దర్శనం చేసుకున్న హోంమంత్రి

by Thanuru Gopichand |

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ఏలూరులో (Eluru) పర్యటించారు.

శ్రీ గంగానమ్మ తల్లిని దర్శనం చేసుకున్న హోంమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ఏలూరులో (Eluru) పర్యటించారు. ఏలూరు ప్రజల ఇలవేల్పు.. కోరి కొలిచిన వారి కొంగు బంగారం విరాజిల్లుతున్న శ్రీ గంగానమ్మ దేవాలయాన్ని హోంమంత్రి సందర్శించారు. ఏలూరు తూర్పు వీధిలోని శ్రీ గంగానమ్మ దేవాలయానికి సంబంధించిన అమ్మవారి జాతర 2025 జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమ కుమార్తెతో కలిసి హోం మంత్రి అమ్మవారి దేవాలయానికి విచ్చేశారు. హోంమంత్రి పర్యటన సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాలు వాయిస్తూ హోంమంత్రికి స్వాగతం పలికారు. జాతర సందర్భంగా మేడలలో కొలువుదీరిన శ్రీ కొర్లపాటి అంకమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను దర్శించుకున్నారు. తన కుటుంబం తరపున అమ్మవార్లకు సారెను సమర్పించారు. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలను చేయించారు.

పూజల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు హోం మంత్రి అనితకు అమ్మవారి చీరను కానుకగా ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిల్లపల్లి సారథి సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. హోమ్ మంత్రి పర్యటన సందర్భంగా ఆలయం వద్ద జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివ కిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సీఐ సత్యనారాయణ ఈ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Next Story