నాగ అంజలి మృతిపై విష ప్రచారం.. హోంమంత్రి అనిత ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-04 11:43:49  IST  )

ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి మృతి అత్యంత బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు...

నాగ అంజలి మృతిపై విష ప్రచారం.. హోంమంత్రి అనిత ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి(Naga Anjali) మృతి అత్యంత బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. రాజమండ్రిలో ఫార్మాసీ విద్యార్థిని నాగ అంజలి ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె మృతిపై రకరకాల దుష్ప్రచారాలు జరిగాయి. దీంతో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నిండు ప్రాణం కాపాడడానికి వైద్యులు చివరివరకూ ప్రయత్నం చేశారని హోంమంత్రి తెలిపారు.

‘‘బతికించుకోవాలనే తపన మాది. శవరాజకీయం చేయాలనే ఆతృత విపక్షాలది. ఘటన తెలిసిన వెంటనే స్పందించాం. మెరుగైన వైద్యసేవలకు ఆదేశించాం. నాగ అంజలికి, బాధిత కుటుంబానికి అండగా ఉంటాం, న్యాయం చేస్తాం. విద్యార్థిని తండ్రి, పెదనాన్నతో నేరుగా ఫోన్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పాం. ప్రాణం కాపాడుకోవాలనే విద్యార్థిని చికిత్సకు ప్రత్యేక వైద్యబృందం ఏర్పాటు చేశాం. రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు చెందిన జనరల్ మెడిసిన్,న్యూరాలజీ, అనస్థిషియా డాక్టర్లతో కమిటీ వేశాం. హెల్త్ బులెటిన్‌ను విడుదల చేయడమే కాకుండా కలెక్టర్ ద్వారా నివేదికలు తీసుకున్నాం. స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాం. నిష్పక్షపాతంగా ఫార్మా విద్యార్థిని కేసు విచారణ జరుగింది. అబద్ధాలతో విషప్రచారం చేయడం తగదు. అనుమానాలు, అపోహలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ చేపట్టాం. నిందితుడిని గాలించి పట్టుకున్నాం, దర్యాప్తు పూర్తికాగానే కఠిన చర్యలు తీసుకుంటాం. విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదు. ఆడబిడ్డల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిన్నారులు, మహిళల రక్షణకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ’’ అని హోమంత్రి అనిత తెలిపారు.

Next Story