తిరుపతి జిల్లాలో భారీ వర్షం.. రోడ్డుపై అడ్డంగా పడిన భారీ వృక్షం

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నానికల్లా వాతావరణం మారిపోయింది....

తిరుపతి జిల్లాలో భారీ వర్షం.. రోడ్డుపై అడ్డంగా పడిన భారీ వృక్షం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District) సత్యవేడు నియోజకవర్గం(Satyavedu Constituency)లో సోమవారం మధ్యాహ్నానికల్లా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆకాశం మేఘావృతమై, చూస్తుండగానే కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షంతో అటు వాహనదారులు, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వర్షం ధాటికి స్తంభించిన జనజీవనం

ప్రధానంగా నాగలాపురం మండలంలో వర్షం ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలుల తీవ్రతకు మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ చెట్లు కూలిన సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

అప్రమత్తమైన యంత్రాంగం

ఇక జిల్లాలో కురుస్తున్న ఈ భారీ వర్షాల పట్ల యంత్రాంగం అప్రమత్తమైంది. చెట్లు విరిగిపడిన ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించేందుకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల చెంత గానీ ఉండొద్దని అధికారులు సూచించారు. రానున్న కొన్ని గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Next Story