Rains: నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-21 02:09:36  IST  )

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐఎండీ బిగ్ అలర్ట్ జారీ చేసింది.

Rains: నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి IMD బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశముందని తెలిపింది. అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది. అలాగే గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వివరించింది.

ఇక ఇవాళ కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు, నెల్లూరు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. రైతులు ఈ అకాల వర్షాలకు తమ పంటలను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే, గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కాగా, నైరుతి ఋతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఈనెల 23, 24 నాటికి కేరళలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అత్యంత అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఎల్‌ నినో ఏర్పడే పరిస్థితులు లేవని గతనెలలోనే అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Next Story