Tdp: వైసీపీకి టైం దగ్గరపడింది

by Disha Web Desk 16 |
Tdp: వైసీపీకి టైం దగ్గరపడింది
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే మోసపూరితమని.. దురుద్దేశంతో పార్టీ ప్రారంభమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. తెనాలి మున్సిపల్ సమావేశంలో జరిగిన దాడిలో గాయపడ్డ టీడీపీ కౌన్సిలర్ యుగంధర్‌ను ఆదివారం కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. మాజీమంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజాలతో కలిసి యుగంధర్‌ను కలిసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ... పార్టీ పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది అయితే ఆచరణ మాత్రం రాజారెడ్డిదంటూ మండిపడ్డారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను వంచించి ధనదాహంతో పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత వ్యాపారాలు పెంచకోవడం తప్ప రాష్ట్రం గురించి పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ నేతలే దాడులు చేస్తే పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు పెట్టించే పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు. కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి వైసీపీ రాక్షస క్రీడకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. కౌన్సిలర్‌పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కన్నాలక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.

వైసీపీ దాడులు దుర్మార్గం : మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

కౌన్సిలర్ యుగంధర్‌పై దాడి అత్యంత దుర్మార్గమని మాజీమంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడం దుర్మార్గమని, రాష్ట్రమంతటా వైసీపీ దాడులకు తెగబడుతోందని విమర్శించారు. సీఎం జగన్ చెప్పినట్లు దోచుకో, పంచుకో, దాచుకో రీతిలో పాలన ఉందని ధ్వజమెత్తారు. తెనాలి వైసీపీ నేతలు పిల్ల చెష్టలతో ఉన్నారని, తెనాలి చరిత్రను వైసీపీ నాశనం చేస్తోందని నక్కా ఆనందబాబు ఆరోపించారు. తెనాలి చరిత్రను కాపాడుకుంటామని...వైసీపీకి టైం దగ్గర పడిందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు.



Next Story

Most Viewed