Ap News: 'జగనాసుర రక్తచరిత్ర' పుస్తకం ఆవిష్కరణ

by Disha Web Desk 16 |
Ap News: జగనాసుర రక్తచరిత్ర పుస్తకం ఆవిష్కరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రతిపక్ష నేతకు స్వయానా బాబాయ్, దివంగత సీఎంకు సొంత తమ్ముడు అయినా వివేకా హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు ఆ కేసు విచారణ ఇప్పటికీ పూర్తి కాలేదు. అయితే వివేకానందరెడ్డిని ఎవరు చంపారు?, ఏ ప్రోద్భలంతో చేశారు?, ఏం ఆశించి చేశారు?, ఆనవాళ్లు లేకుండా ఆ హత్యను ఇతరులపైకి ఎలా నెట్టారనే పూర్తి వివరాలతో తెలుగుదేశం పార్టీ 'జగనాసుర రక్తచరిత్ర' పేరుతో పుస్తకాన్ని ముద్రించింది. వివేకా హత్యలో వేళ్లన్నీ జగన్ రెడ్డి - భారతీరెడ్డి కుటుంబం వైపే చూపిస్తున్నాయని పుస్తకంలో వెల్లడించారు.

ఈ పుస్తకాన్ని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామా నాయుడు, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా మహేశ్వరరావు, టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఇతర నేతలు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 'జగనాసుర రక్తచరిత్ర' (బహిరంగం) పుస్తకం చేరాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే ప్రజలకు నిజాలు, హత్యకు పాల్పడిన దోషుల వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. 'అధికారం కోసమే జగన్ రెడ్డి సొంతబాబాయ్ ని బలితీసుకున్నాడు. వివేకాహత్య తాలూకా వాస్తవాల దర్పణం 'జగనాసుర రక్తచరిత్ర' పుస్తకం. వివేకా హత్యతో ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిపై, వైసీపీపై కేంద్రఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.' అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.


Next Story