మీ బిడ్డనంటున్నాడు..భూములు కొట్టేస్తాడు జాగ్రత్త! నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 18 |
మీ బిడ్డనంటున్నాడు..భూములు కొట్టేస్తాడు జాగ్రత్త! నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి,గుంటూరు: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులను తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములిచ్చిన రైతులపై జగన్ కర్కశంగా వ్యవహరించారు. దళిత రైతులకు బేడీలు వేశారు, మహిళా రైతులను బూటు కాళ్లతో తొక్కించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమించారు. మరో నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం రాగానే రైతులకు గత మూడేళ్లుగా చెల్లించాల్సిన కౌలు బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తాం, రాజధాని కూలీలకు రూ.5 వేల పెన్షన్‌ను పెండింగ్ లేకుండా ప్రతినెలా చెల్లిస్తాం అన్నారు.

అమరావతి ప్రాంతంలో అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు చూస్తే బాధేస్తోంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని – జై అమరావతి అన్నదే మా నినాదం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిన జగన్ ఒక్క ఇటుక వేయలేదు. విశాఖలో భూ కుంభకోణం తప్ప ఒక్క అభివృద్ధి జరగలేదు. అమరావతి రాజధాని పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేది. జగన్ అండ్ కో రాజమౌళి సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు రావడం గ్యారంటీ. 2019లో కోడి కత్తి ఘటన జరిగాక బాబాయ్ శవం లేచింది. తాజాగా స్పెషల్ గులకరాయి సీఎం తో పాటు వెల్లంపల్లి రెండు కళ్లకు తగిలింది. జగన్ బస్సు యాత్ర సాగినంతసేపు నుదుటిపై బ్యాండేజ్ రోజురోజుకు పెద్దదైందని ఎద్దేవా చేశారు.

యాత్ర పూర్తికాగానే గాయం ఆటోమేటిక్‌గా మాయమైంది. ఇక ఇటువంటి డ్రామాలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మీ బిడ్డనంటూ పదేపదే అంటున్న జగన్ ప్రజల భూములు కొట్టేసేందుకు నయా ప్లాన్ వేశారు. ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారట. ఆయన ఆస్తులు ఇచ్చినట్లు పత్రాలపై ఫోటో వేసుకుంటున్నాడు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా విలువైన ఆస్తులు లాగేస్తారు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగ కోరుతున్నా. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతాం. వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే మా లక్ష్యం. అందరం కలసికట్టుగా కష్టపడి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి చేసుకుందాం అని నారా లోకేష్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed