Guntur: ట్రాక్టర్ బోల్తా ప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం ప్రకటన

by Disha Web Desk 16 |
Guntur: ట్రాక్టర్ బోల్తా ప్రమాద బాధితులకు ప్రభుత్వ సాయం ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: వట్టిచెరుకూరు ప్రమాద బాధితులను పత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున సాయం ప్రకటించారు. మృతులకు రూ.5 లక్షలు, తీవ్ర గాయాలైన వారికి రూ. లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయం అందస్తామని ఆమె తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా 20 మంది వరకు గాయాలపాలయ్యారు. వీరికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుచరిత గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

కాగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతిపాడు మండలం కొండెపాడుకు 40 మంది గ్రామస్తులు ఓ శుభకార్యం నిమిత్తం ట్రాక్టర్‌లో చేబ్రోలు మండలం జూపుడికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానిక సీసీపుటేజ్‌ను పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ట్రాక్టర్‌ను అతివేగంగా నడపటం వల్లే అదుపు తప్పిందని తెలిపారు.


Next Story

Most Viewed