రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రైతుల పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు

by Disha Web Desk 13 |
రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రైతుల పిటిషన్‌ను తిరస్కరించిన ఏపీ హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి ప్రాంత రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. అమరావతి R5 జోన్ పై రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. అంతేకాదు రాజధానిలో పేదల ఇళ్ల స్థలాలల పంపిణీకి ఉన్న అడ్డంకులు తొలగినట్లైంది. ఇకపోతే రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా జగన్ సర్కార్ ఆర్5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది.

ఆర్5 జోన్ కోసం గుంటూరు జిల్లా నుంచి 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీయే కమిషనర్‌కు అనుమతిస్తూ జీవో నెం.45ను ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే ప్రభుత్వం నిర్ణయంపై అమరావతి రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో నంబర్ 45ను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

అమరావతి భూములను సీఆర్డీఏ ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. రైతుల పిటిషన్‌ను తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి రైతులు శనివారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు.



Next Story

Most Viewed