కుప్పం ప్రజలకు తీపి కబురు.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Ramesh Naini |

కుప్పం ప్రజలకు తీపి కబురు.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ తీపికబురు అందించింది. కుప్పం స్టేషన్‌లో రెండు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు.

నిలుపుదల చేయనున్న రైళ్లు ఇవే..

వాస్కోడగామా - వేలంకణి ఎక్స్‌ప్రెస్.. గోవా నుంచి తమిళనాడులోని వేలంకణి వెళ్లే ఈ రైలు ఇకపై కుప్పం స్టేషన్‌లో ఆగనుంది. దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్.. ముంబై (దాదర్) నుంచి పుదుచ్చేరి వెళ్లే ఈ రైలుకు కూడా కుప్పంలో స్టాపేజ్ మంజూరు చేశారు.

సీఎం విజ్ఞప్తికి తక్షణ స్పందన..

ఈ నెల 10వ తేదీన ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు, వ్యాపారులు, భక్తుల కోసం అక్కడ దూరప్రాంత రైళ్లను నిలపాలని స్థానికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం విజ్ఞప్తి చేసిన వారం రోజుల వ్యవధిలోనే రైల్వే శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవడం విశేషం. స్థానిక ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, యుద్ధప్రాతిపదికన కుప్పం రైల్వే స్టేషన్‌లో స్టాపేజ్‌లకు అనుమతి ఇచ్చినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల కుప్పం పరిసర ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

Next Story