బంగ్లాదేశ్ నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు

by Thanuru Gopichand |

తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు.

బంగ్లాదేశ్ నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ జైలు (Bangladesh Jail) నుంచి విడుదలైన విశాఖపట్నం మత్స్యకారులు (Visakapatnam Fisherman) సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడంతో తీర ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు సముద్ర సరిహద్దులు దాటడంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ చేతికి 9 మంది విశాఖ మత్స్యకారులు చిక్కారు. వారు సుమారు మూడు నెలల పాటు అక్కడి భాగర్ హాట్ జైలులో (Bagarhat Jail) మగ్గిపోయారు. భారత ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన నిరంతర దౌత్యపరమైన చర్చల ఫలితంగా వారితో పాటు మొత్తం 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు.

ఈ మత్స్యకారులు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు (Fishing Harbor) చేరుకోగా.. వారికి జిల్లా యంత్రాంగం, మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు మత్స్యకారుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన వైద్య సహాయం, రవాణా ఏర్పాట్లు చేశారు. తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. మత్స్యకార నాయకులు మాట్లాడుతూ ప్రతికూల వాతావరణం, సాంకేతిక లోపాల వల్ల మత్స్యకారులు తరచూ ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారిని విడిపించడంలో సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story