ప్రతి కార్మికుడు సైనికుడిలా సేవలందించారు

by Thanuru Gopichand |

మొంథా తుఫాను సమయంలో విద్యుత్ శాఖలోని ప్రతి కార్మికుడు సైనికుడిలా సేవలందించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు.

ప్రతి కార్మికుడు సైనికుడిలా సేవలందించారు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను సమయంలో విద్యుత్ శాఖలోని ప్రతి కార్మికుడు సైనికుడిలా సేవలందించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) అన్నారు. ఇటీవల మొంథా తుఫాను (Cyclone Montha) కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. తుఫాను తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అయితే తుఫాను సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ కార్మికులు క్షేత్ర స్థాయిలో పనిచేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులను చేపట్టారు. తుఫానును సైతం లెక్క చేయకుండా విద్యుత్ సరఫరాకు కలిగిన ఆటంకాలను సాహసోపేతంగా అధిగమించారు. వారి నిబద్ధత పట్ల మంత్రి రవికుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి ప్రతి ఒక్క విద్యుత్ శాఖ కార్మికుడు (Electricity Department Worker) ఒక సైనికుడై క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించి ప్రజల మన్ననలు పొందటం ఎంతో అభినందనీయం అన్నారు. తుపాను తీరం దాటిన 24 గంటల్లోనే 100 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయడం కార్మికుల నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. తుఫాను ధాటికి.. విద్యుత్ తీగలు తెగిపోయాయని, స్తంభాలు నేలకొరిగాయని, సబ్ స్టేషన్లు నీట మునిగాయని పేర్కొన్నారు. ఇటువంటి సంక్షోభంలో కార్మికులు చూపిన ధైర్యం, పట్టుదల, అహర్నిశలు వారు చేసిన శ్రమ ప్రజాసేవకు అద్దం పడుతుందని కొనియాడారు. కార్మికుల కృషితో తీవ్ర అంతరాయం తరువాత కూడా ప్రజలు సాధారణ జీవనాన్ని గడుపుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ గొప్ప క్రతువులో భాగమైన ప్రతీ ఉద్యోగినీ అభినందించారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎండీలు, డైరెక్టర్లు, ఇతర అధికారులకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.

Next Story