విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా

by Thanuru Gopichand |

ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకుల హెచ్చరిక.

విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్స్ ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడలో విద్యుత్ మీటర్ రీడర్ల (Electric Meter Readers) ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో భారీ ధర్నా (Protest) నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,800 మంది మీటర్ రీడర్లు గత ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ, కూటమి ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోవడంతో ఛలో విజయవాడకు (Chalo Vijayawada) పిలుపునిచ్చారు. దీంతో విద్యుత్ ఉద్యోగులు (Electricity Employees) భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవాడ వీధుల్లో నిరసన తెలిపారు.

ప్రధానంగా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం కావడంతో తమ ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 నుంచి 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల (Smart Meters) వల్ల తమను రోడ్డున పడేయడం అన్యాయమని అంటున్నారు. తమకు విద్యుత్ శాఖలోనే అర్హతను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లు, లైన్‌మెన్, ఇతర విభాగాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Next Story