ప్రజల చెంతకే విద్యుత్ శాఖ.. అనూహ్య స్పందన

by Thanuru Gopichand |

అనూహ్య స్పందన పొందుతున్న కరెంటోళ్ల జనబాట.

ప్రజల చెంతకే విద్యుత్ శాఖ.. అనూహ్య స్పందన
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలిపే మరో కార్యక్రమమే కరెంటోళ్ల జనబాట. విద్యుత్ శాఖపై (Electricity Department) ఫోకస్ పెంచిన ఏపీ ప్రభుత్వం.. వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా స్వయంగా వినియోగదారుల ఇంటి వద్దనే సమస్యలను పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 23, 2025న ప్రారంభించిన కరెంటోళ్ల జనబాట (Currentolla Jana Bata) కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

సమస్యల పరిష్కారమే ధ్యేయం

విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా కరెంటోళ్ల జనబాటను తీసుకొచ్చింది. వివిధ జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమంలో ఇప్పుడు విజయవంతంగా కొనసాగుతోంది. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు.

ఇంటింటికి విద్యుత్ అధికారులు

కరెంటోళ్ల జనబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామ స్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి వారు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా అక్కడికక్కడ సంబంధిత సమస్యలను పరిష్కరం చూపిస్తే ప్రజలకు విద్యు్త్ సంబంధిత సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తున్నారు.

ప్రతి మంగళ.. శుక్రవారాల్లో

ఈ కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. అందులో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళ, శుక్రవారం కరెంటోళ్ల జనబాటను నిర్వహిస్తున్నారు.

ఏ సమస్యలపై ఫోకస్ అంటే

తమ పర్యటనలో భాగంగా అధికారులు వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేస్తున్నారు. వేలాడుతున్న వైర్లను బిగిస్తున్నారు. ప్రజా భద్రతకు ప్రాధాన్యమిస్తూ ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ లేకపోతే అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. వినియోగదారులు ఎదుర్కొనే మీటర్ రీడింగ్, అదనపు బిల్లుల వంటి ఫిర్యాదులకు కూడా ఆన్ ది స్పాట్ పరిష్కారం చూపుతున్నారు.

రైతన్నలకు భరోసా

వ్యవసాయంలో కరెంటు వినియోగం పెరిగింది. ఈ క్రమంలో పంటను పండించేందుకు నీటి కోసం విద్యుత్ బోర్లను వాడుతున్నారు. వాటి నిర్వహణకు నాణ్యమైన విద్యుత్ అవసరం పడుతుంది. రైతులు తరచూ లో- ఓల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెడుతున్న విద్యుత్ అధికారులు.. సమస్యను గుర్తించి సాగుకు అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నారు.

సౌర విద్యుత్ పై అవగాహన

విద్యుత్ శాఖ అధికారులు కేవలం సమస్యల పరిష్కారంపైనే ఫోకస్ చేయడం లేదు. విద్యుత్ పై పెట్టే ఖర్చులను ఆదా చేసే మార్గాలపై కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధానంగా సౌర విద్యుత్ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం సూర్య ఘర్ (PM Surya Ghar) వంటి రూఫ్ టాప్ సోలార్ పథకాల గురించి వారికి తెలియజేస్తున్నారు. తద్వారా గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ ఖర్చుల ఆదా దిశగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంతో అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ మెరుగుపడుతోంది. అంతేకాకుండా వినియోగదారుల్లో విద్యుత్ శాఖ కార్యక్రమాల పట్ల ఆదరణ పెరుగుతోంది.

Next Story