ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచిన ఈడీ క్లీన్‌చిట్ : మంత్రి

by Thanuru Gopichand |

రాజకీయ కక్ష సాధింపుగా పెట్టిన కేసులు కోర్టులో వీగలేదు. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విత్ డ్రా కావడం ఆరోపణలు చేసిన వారికి చెంప పెట్టు అని మంత్రి అన్నారు.

ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచిన ఈడీ క్లీన్‌చిట్ : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : స్కిల్ కేసులో సీఎం చంద్రబాబు నాయుడుకి (Chandra Babu Naidu) ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. కేసులో సీఎంకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం లేదని చార్జిషీట్లో పేర్కొంది. దీంతో టీడీపీ (TDP) శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) స్పందిస్తూ.. సత్యం, న్యాయం మీద నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అని.. ఈడీ క్లీన్ చిట్ ఆయన నిజాయితీకి నిదర్శనం అని అన్నారు. సీఎం ప్రమేయం లేదని ఈడీ చార్జిషీట్లో పేర్కొనడం ఆయన స్వచ్ఛమైన రాజకీయాలకు గుర్తింపు అన్నారు. కక్ష రాజకీయాలకు చంద్రబాబు నాయుడు భయపడరన్నారు. చట్టానికి గౌరవం ఇచ్చే వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు.

దేశ భవిష్యత్తు కోసం యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఆలోచన చేశారని.. అది ఆయన దూరదృష్టికి నిదర్శనం అని చెప్పారు. ఏపీ సీఐడీ, ఈడీ రెండూ సీఎం చంద్రబాబు పాత్ర లేదని తేల్చడం ఆయన పరిపాలనా పారదర్శకతను కళ్లకు కడుతున్నాయని చెప్పారు. కేసు విజయవాడ ఏసీబీ కోర్టులో విత్ డ్రా కావడం తప్పుడు ఆరోపణలు చేసిన వారికి చెంపపెట్టులాంటిది అన్నారు. నిజాయితీ, విలువలతో రాజకీయాలు చేయవచ్చని నిరూపించిన అరుదైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు చేసినా, చివరికి గెలిచేది సత్యమేనని కుండ బద్ధలుగొట్టారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా, వ్యక్తిగత దూషణలకు లొంగకుండా ముందుకు నడిచే నేత అని కొనియాడారు. ఈడీ క్లీన్ చిట్ సీఎం చంద్రబాబు నాయకత్వంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచిందని అభిప్రాయపడ్డారు.

Next Story