తుని బరిలో Yanamala Divya.. ఆమె ఇచ్చిన ఫస్ట్ హామీ ఏంటో తెలుసా?

by Disha Web Desk 16 |
తుని బరిలో Yanamala Divya.. ఆమె ఇచ్చిన ఫస్ట్ హామీ ఏంటో తెలుసా?
X

దిశ, తుని: తుని నియోజకవర్గ ఇంచార్జిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను టీడీపీ అధినేత చంద్రబాబు నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తండ్రి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమాశంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, వనమాడి కొండబాబు, వంగలపూడి అనిత, పెందుర్తి వెంకటేష్ లతో పాటు జిల్లా టీడీపీ నేతలు జ్యోతుల నవీన్, వరుపుల రాజా పాల్గొన్నారు. వరపుల రాజా సమక్షంలో కార్యకర్తలకు ఆమెను యనమల కృష్ణుడు పరిచయం చేశారు.


ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నానన్నారు. తుని నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తుని అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు, కార్యదర్శి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం యనమల కృష్ణుడు మాట్లాడుతూ తన అన్న రామకృష్ణుడు గెలుపునకు ఎలా కృషి చేశానో అదేవిధంగా కుమార్తె దివ్య గెలుపునకు కూడా అదే విధంగా కృషి చేస్తానని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ దివ్య గెలుపునకు కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చెయ్యాలన్నారు. రానున్న రోజుల్లో కృష్ణుడు, దివ్యలతో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. కృష్ణుడికి తనకు ఎటువంటి విభేదాలు లేవని యనమల చెప్పారు. తామంతా ఒకటే కుటుంబమని, అది తెలుగుదేశం కుటుంబమేనని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ తుని సీటు గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ దేశంలో సొంత బాబాయిని చంపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. జగన్ ఇంటి చుట్టూ పోలీస్ కుక్కలు తిరుగుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుందని మండిపడ్డారు. త్వరలో శోభనానికి కూడా జగన్ ప్రభుత్వం పన్ను వేస్తుందన్నారు. ఈ సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ యనమల కృష్ణుడుని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పార్టీ ఉతర్వులు ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా కృష్ణుడిని యనమల, బండారు, వర్మ, వరుపుల రాజా, జ్యోతుల నవీన్ సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యినుగంటి సత్యనారాయణ, పోల్నాటి శేషగిరి, సుర్ల లోవరాజు, శివరామకృష్ణ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed