ఈగల్ టీమ్ మెరుపుదాడి.. తెనాలిలో డ్రగ్స్ కలకలం

by Naga Rani Yarlagadda |

గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ పట్టుబటడం కలకలం రేపింది. నలుగురు యువకుల వద్ద పోలీసులు, ఈగల్ టీమ్ MDMAను స్వాధీనం చేసుకున్నారు.

ఈగల్ టీమ్ మెరుపుదాడి.. తెనాలిలో డ్రగ్స్ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ సమీపంలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను కలిగి ఉన్న నలుగురు యువకులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో తెనాలి త్రీటౌన్ పోలీసులు, ఈగల్ టీమ్ (Eagle Team) కలిసి పట్టణంలోని సుల్తానాబాద్ మార్కెట్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని సోదా చేయగా, వారి వద్ద నిషేధిత ఎండీఎంఏ డ్రగ్స్ బయటపడ్డాయి.

బెంగళూరు టు తెనాలి..

పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈ డ్రగ్స్‌ను నిందితులు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గుట్టుచప్పుడు కాకుండా తెనాలికి తరలించారు. వీరి నుంచి సుమారు 5 గ్రాముల MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నలుగురు యువకులను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. వీరు కేవలం వినియోగదారులేనా? లేక పట్టణంలోని కళాశాల విద్యార్థులకు వీటిని విక్రయించేందుకు తెచ్చారా? అనే కోణంలో విచారణ సాగుతోంది. వీరి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు బెంగళూరు నెట్‌వర్క్‌పై ఆరా తీస్తున్నారు.

Next Story