ధర్మవరం గరంగరం.. ఈ స్థానం బీజేపీకేనా!

by Disha Web Desk 1 |
ధర్మవరం గరంగరం.. ఈ స్థానం బీజేపీకేనా!
X

దిశ ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల షెడ్యూల్ విడుదలకు గడువు సమీపించే కొద్దీ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్ కోసం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గోనుగుంట్ల సూర్యనారాయణ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముందు నుంచి టికెట్ తమకేనంటూ ఎవరికి వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో ధర్మవరం స్థానం బీజేపీకి కేటాయిస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నా యి. ఈ విషయంలో స్పష్టత రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పట్టే అవకాశ ముంది. ఈ క్రమంలో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. తక్షణమే అభ్యర్థి పేరు ప్రకటించి.. ఈ గందరగోళానికి తెరదించాలని వారు కోరుతున్నారు.

ముందు వరుసలోకి గోనుగుంట్ల..

బీజేపీతో పొత్తు కుదరడంతో ధర్మవరం స్థానాన్ని ఆ పార్టీకి టీడీపీ కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. టీడీపీ టికెట్ కోసం ఇంతకాలం ప్రయత్నిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు ఈ పొత్తు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. టీడీపీలో చేరేదెన్నడు? టికెట్ తెచ్చుకునేదెన్నడు? అనే సందేహాలను ఈ పొత్తు పటాపంచలు చేసింది. పార్టీ మారకుండానే టికెట్ లభించడమంటే వెతకబోయే తీగ కాలికి తగిలినట్టే కదా? 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేసి.. భారీ మెజారిటీతో గోనుగుంట్ల గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం అదే స్థానంలో ఓటమిని చవిచూశారు. పైగా, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో చేరడమే సురక్షితమని గోనుగుంట్ల భావించారు. వెంటనే ఆ పార్టీ గూటికి చేరుకున్నారు. నాలు గున్నరేళ్లుగా మనసు టీడీపీలో.. తనువు బీజేపీలో అన్నట్టు ఉండిపోయారు. అయితే, ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ధర్మవరం స్థానం కూటమి తరపున ఆయన(బీజేపీ)కే లభించే అవకాశాలున్నాయి.

పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏమిటి..?

2019 ఎన్నికల అనంతరం గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరి పోవడంతో ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్‌ను ఆ పార్టీ నాయకత్వం నియమించింది. తొలుత అయిష్టత చూపినా ఆ తరువాత యాక్టివ్ అయ్యారు. రెగ్యులర్ గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రేణులకు చేరువయ్యారు. పోలీసు కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నారు. అయినా, ఇప్పుడు శ్రీరామ్ ను కాదని గోనుగుంట్లకే టికెట్ లభించే పరిస్థితులు ఏర్పడడం ఆశ్చర్యం కలిగించే అంశం. అదే గనుక జరిగితే పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమే.

కలిసి పని చేయడం సాధ్యమా?

పొత్తులో భాగంగా బీజేపీకి ధర్మవరం స్థానాన్ని కేటాయించినట్లు వార్తలు వస్తుండడంతో పరిటాల శ్రీరామ్ అభిమానులు రగిలిపోతు న్నారు. ఐదేళ్లుగా కష్టపడి పని చేస్తే పార్టీ ఇచ్చే గుర్తింపు ఇదేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మీరు పంపితేనే కదా ధర్మవరానికి శ్రీరామ్ వెళ్లారు అని నిలదీస్తున్నారు. ఐదేళ్లుగా పని చేయించుకుని ఇప్పుడు కరివేపాకులా తీసి పారేస్తారా అంటున్నారు. దీనికి తోడు గోనుగుంట్ల సూర్యనారాయణ, పరిటాల కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ, బీజేపీ కలిసి పనిచేయడం సాధ్యమేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

కేతిరెడ్డిని ఓడించేనా?

ఈ ఐదేళ్ల కాలంలో అధికార వైసీపీ ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలకు కొదువ లేదు. భూ కబ్జాలు, ఇసుక, మట్టి అక్రమ రవాణాతో పాటు రియల్ ఎస్టేట్, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే కమీషన్ తో రూ. కోట్లకు పడగలెత్తారు. ధర్మవరం చెరువు వద్ద ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని.. అక్కడ అతిథి గృహం నిర్మించుకోవడంతో పాటు గుర్రపు స్వారీ, బోటింగ్ వంటి కార్యకాలాపాలు చేపడుతూ రాజభోగాలు అనుభవిస్తున్నారనే విమర్శలున్నాయి. అలాంటి అక్రమార్కుడిని ఓడించాలంటే పొత్తు కుదుర్చుకున్న పార్టీల నేతలందరూ ఏకతాటిపైకి రావాల్సి ఉంది. అయితే ఉప్పు- నిప్పుగా ఉంటున్న పరిటాల, గోనుగుంట్ల కుటుంబాలు కలిసి పనిచేయడమనేది అంత సులువైన విషయం కాదు.

Next Story

Most Viewed