- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంద్రకీలాద్రిపై నిర్వహణ లోపం.. భక్తులకు షాక్
వ్యవస్థలో లోపాల కారణంగా ఇంద్రకీలాద్రిలో ఇబ్బందులు.

దిశ, వెబ్ డెస్క్: ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) కొలువైన బెజవాడ కనకదుర్గమ్మ (Bejawada kanaka Durgamma) ఆలయంలో నిర్వహణ లోపం బయటపడింది. అయితే భక్తులు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఆలయ ప్రాంగణంలోని ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులు విద్యుత్ షాక్ కు (Electric Shock) గురయ్యారు. శనివారం జరిగిన ఈ ఘటనలో భక్తులెవ్వరికి (Devotees) ఏమి కాలేదు. అయితే ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న భక్తులకు విద్యుత్ షాక్ తగలడంతో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న దేవాలయ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం యధావిధిగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే అమ్మవారి దేవస్థానంలో ఇటువంటి నిర్లక్ష్యం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని.. ఆదాయంపై కాకుండా దేవాలయ పవిత్రత, భక్తుల భద్రతపై ఫోకస్ పెంచాలని కోరుతున్నారు.
శుక్రవారం శ్రీచక్ర అర్చనకు వినియోగించిన పాలల్లో పురుగులు రావడం కూడా భక్తుల్లో తీవ్ర కలవరానికి కారణమైంది. నిల్వ ఉంచిన పాలను అమ్మవారి పూజలో వినియోగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజా పాలను నేరుగా గోవులను సేకరించి వినియోగించాల్సి ఉండగా.. ఇటువంటి చర్యకు పాల్పడడం సర్వత్రా విమర్శలకు కారణమైంది. అంతేకాకుండా గతేడాది డిసెంబరులో దేవస్థానం బోర్డు, విద్యుత్ శాఖ మధ్య రూ.3.08 కోట్ల విద్యుత్ బకాయిల వివాదం కూడా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో భక్తుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఏకంగా సీఎం కార్యాలయమే ఈ వివాదంపై జోక్యం చేసుకొని పరిష్కారించాలని ఆదేశించడంతో.. ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై ఇలాంటి భద్రతా లోపాలు, అపచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






