అమెరికాలో తెలుగు వైద్య విద్యార్థి మృతి.. మరణానికి కారణం ఇదేనా?

by Disha Web Desk 21 |
అమెరికాలో తెలుగు వైద్య విద్యార్థి మృతి.. మరణానికి కారణం ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉన్నత వైద్య విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన 22 ఏళ్ల యువతి విగతజీవిగా మారింది. అమెరికాలో మెడిసిన్ చదువుతున్న యువతి బుధవారం షికాగో నగరంలో కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రూరల్ ప్రసాదంపాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ (22) విజయవాడలో ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. అయితే ఎంఎస్‌ చేసేందుకు ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు. అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌ లీకైంది. దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్‌ స్పృహ తప్పారు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జహీరా నాజ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జహీరా నాజ్ మరణ వార్తను ఆమె స్నేహితులు విజయవాడలోని తల్లిదండ్రులకు తెలియజేశారు. జహీరా నాజ్ మృతితో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఎంఎస్ పూర్తి చేసి తమ కుటుంబానికి ఆసరాగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు తమ కూతురు ఇలా అర్థాంతరంగా చనిపోతుందని ఊహించలేకపోయామని విలపిస్తున్నారు. జహీరానాజ్ మృతదేహాన్ని విజయవాడలోని స్వగృహానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు.

Next Story

Most Viewed