ఏపీకి తుపాను హెచ్చరిక .. మూడు రోజులు జరభద్రం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-24 11:15:15  IST  )

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది....

ఏపీకి తుపాను హెచ్చరిక .. మూడు రోజులు జరభద్రం
X

దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపటికి ఆగ్నేయ, దాని పక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇది సోమవారం ఉదయానికి నైరుతి, దానికి ప్రక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ-రేపు భారీ వర్షాలు, ఆదివారం భారీ నుంచి అతిభారీవర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతప్రజలు అలెర్ట్‌గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

Next Story