క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ కు సహకరించండి : ఏపీ మంత్రి లోకేష్

by Thanuru Gopichand |   (  Updated:2025-10-23 05:44:36  IST  )

ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ కు సహకరించాలని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులను కోరారు.

క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ కు సహకరించండి : ఏపీ మంత్రి లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ (Quantum Technology) రీసెర్చ్ కు సహకరించాలని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విశ్వవిద్యాలయం (University Of Melborne) పరిశోధకులను కోరారు. తన ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ క్వాంటమ్ పరిశోధనలు, ఉపాధ్యాయ శిక్షణపై వర్సిటీ ఉన్నతస్థాయి బృందంతో చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతికతలపై నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడానికి ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో సంయుక్త పరిశోధనా కేంద్రాలను (Collabarative Research Centers) ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగస్వామ్యం వహించాలన్నారు.

పంట దిగుబడులు, వాటర్ మేనేజ్ మెంట్, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంపై ఏపీలోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పరస్పర సహకారంతో పరిశోధనలు నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థలను భాగస్వాములుగా చేసి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్, టెలీ మెడిసిన్ (Tele Medicine) ద్వారా ఆరోగ్య సేవలను మెరుగుపర్చేందుకు సహకారం అందించాలన్నారు. స్మార్ట్ సిటీ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక శక్తి రంగాల్లో నైపుణ్యాలను పంచి ఆంధ్రప్రదేశ్ పట్టణ అభివృద్ధి లక్ష్యాల సాధనకు మద్దతుగా నిలవాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎమ్మా జాన్స్టన్ మాట్లాడుతూ మంత్రి లోకేష్ కోరిన విధంగా సహకారం అందించడానికి సుముఖతను వ్యక్తం చేశారు. మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం భారత్ లోని న్యూ ఢిల్లీలో మెల్‌బోర్న్ గ్లోబల్ సెంటర్ భాగస్వామ్యం, పరిశోధన, అనుసంధాన కార్యక్రమాలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తోందన్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని శూలిని విశ్వవిద్యాలయం, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR)తో సహా ఐదుకు పైగా భారతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. భారతీయ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ భాగస్వాములను అనుసంధానిస్తూ విద్య, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భారతదేశంలో బోధనా క్యాంపస్ లేకుండా స్థానిక భాగస్వామ్యాల ద్వారా ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, డ్యూయల్ డిగ్రీలు, సంయుక్త పరిశోధన కార్యక్రమాలను అందిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ఎమ్మా జాన్స్టన్ తెలిపారు.

Read More: విక్టోరియా రాష్ట్ర సహకారం కోరిన ఏపీ మంత్రి నారా లోకేష్

Next Story