ట్యాబ్‌ల పేరుతో భారీ స్కామ్.. జగన్ సర్కార్‌పై కామ్రేడ్ల ఆగ్రహం

by Disha Web Desk 16 |
ట్యాబ్‌ల పేరుతో భారీ స్కామ్.. జగన్ సర్కార్‌పై కామ్రేడ్ల ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ విద్యా విధానంలో సమూల మార్పులు తెచ్చామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇంగ్లీష్ విద్యను అందించేందుకు 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్‌లు, వాటికి కావాల్సిన కంటెంట్‌ను అందిస్తున్నామని ఆయన పదే పదే ప్రచారం చేస్తున్నారు. విద్య కోసం తాను ఎంత ఖర్చు పెట్టేందుకు వెనకడానని పలు బహిరంగ సభల్లోనూ జగన్ ఊదరగొట్టారు. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేస్తున్నారు.


అయితే ఈ స్కీమ్‌లో స్కామ్ రాష్ట్ర కామ్రెడ్లు ఆరోపిస్తున్నారు. ట్యాబ్‌ల పేరుతో దాదాపు రూ. 1,250 కోట్ల మేర అవినితి జరిగిందని అంటున్నారు. ఈ స్కామ్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ చేస్తున్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.9 వేలు విలువ చేసే ట్యాబులను అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాదిలో ఒక్కో ట్యాబ్‌ను రూ.13 వేలకు కొనుగోలు చేసి రూ.4 వేల వరకూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఏడాది రూ.12 వేలున్న ట్యాబ్‌ను రూ.17,500కు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం చూపుతోందని తెలిపారు. ఇలా ట్యాబ్‌ల కొనుగోళ్ల ద్వారా రూ.250 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ట్యాబ్‌ల ద్వారా కంటెంట్ అందించేందుకు రూ. 1000 కోట్ల మేర స్కాంకు పాల్పడ్డారని మండిపడ్డారు. ట్యాబ్‌లు, వాటికి కావాల్సిన కంటెంట్‌‌ను అందించేందుకు తీవ్ర నష్టాల్లో బైజూస్ కంపెనీకి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను అందించిందని చెప్పారు. ట్యాబ్‌ల పేరుతో జరిగిన అవినీతిపై సమగ్రంగా విచారణ జరగాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.


Next Story