కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాట పట్టిస్తోంది : మంత్రి

by Thanuru Gopichand |

నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం.

కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాట పట్టిస్తోంది : మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం (Prakasam District Formation Day) సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా (Prakasam District) కష్టపడే మనస్తత్వం, సంస్కృతి సంప్రదాయాలకు నెలవు అన్నారు. మూడు విభిన్న ప్రాంతాల కలయికతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోందని మంత్రి కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాను అభివృద్ధి (Development) బాట పట్టిస్తోందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు.

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసేందుకు పారిశ్రామిక హబ్‌ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), మంత్రి నారా లోకేశ్‌లకు (Nara Lokesh) ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రకాశం జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు.

Next Story