వైఎస్ఆర్ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన

by Disha Web Desk 21 |
వైఎస్ఆర్ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగిసింది. వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ఇడుపులపాయలో పర్యటించారు. రూ.1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, రూ.2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అనంతరం అర్జీదారుల నుంచి అర్జీలను సీఎం జగన్ స్వీకరించారు. అనంతరం అక్కడ నుంచి ఎకో పార్కు వద్దకు చేరుకున్నారు అక్కడ వేముల మండల పార్టీ నాయకులు, ప్రజలతో సమావేశమయ్యారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వైఎస్ఆర్ కడప ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయం బయలుదేరినట్లు తెలుస్తోంది.

రెండు రోజులు బిజీబిజీ

వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ బిజీబీజీగా గడిపారు. తొలిరోజైన గురువారం రాయ‌చోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకలోనూ పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. ఆ తర్వాత పులి వెందులలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పులివెందుల‌లో శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంత‌రం పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి బయలుదేరి స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అక్క‌డి నుంచి ఆదిత్య బిర్లా యూనిట్‌ను విజిట్ చేశారు. ఆ తర్వాత తమ స‌మీప బంధువు సీవీ సుబ్బారెడ్డి కుటుంబాన్ని సీఎం జగన్ ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల అనారోగ్యంతో సీవీ సుబ్బారెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి సీఎం ప‌రామ‌ర్శించారు. ఇంటి పెద్ద కోల్పోయిన‌ప్పుడు గుండె నిబ్బ‌రంతో ఉండాల‌ని సుబ్బారెడ్డి స‌తీమ‌ణిని ఓదార్చారు. పరామర్శ అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed