ఏపీకి మరో ఐదేళ్లు రాజధాని హాంఫట్.. కుండబద్దలు కొట్టేసిన సీఎం జగన్

by Disha Web Desk 16 |
ఏపీకి మరో ఐదేళ్లు రాజధాని హాంఫట్.. కుండబద్దలు కొట్టేసిన సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: ‘‘ఏపీకి రాజధాని అమరావతే. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక రాజధానికి మద్దతు ఇస్తున్నాం. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నాను కాబట్టే ఇల్లు కట్టుకున్నా. రాజధాని అభివృద్ధికి సహకరిస్తా.’’ ఇది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ వేదికగా చెప్పిన మాట. ప్రజలు నమ్మారు. ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే మనసు మార్చుకున్నారు. రాజధానిపై జగన్‌కు అసహ్యం పుట్టింది. వికేంద్రీకరణపై ప్రేమ పుట్టింది. మూడు రాజధానులు అంశాన్ని అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారు. ఒకటి విశాఖ, రెండు అమరావతి, మూడు కర్నూలును అంటూ ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. శాసనమండలిలో ఓడిపోయారు. అయినా మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు అంటూ పోరాటం చేశారు. చివరకు సుప్రీం ధర్మాసనం వేదికగా వెనక్కి తగ్గారు. సరైన సమయంలో పూర్తి వివరాలతో రాజధానిని బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని చేతులెత్తారు. అలా కొన్ని రోజులు కాలం గడిపేశారు. ఆ తర్వాత మళ్లీ మూడు రాజధానులు ఉండాల్సిందేనని పాట అందుకున్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేయాల్సిందేనని నిశ్చయించుకున్నారు.

తాజాగా రాష్ట్రంలో 2024 ఎన్నికలు రానే వస్తున్నాయి. మరో 16 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అట్టహాసంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. మూడు రాజధానులపై కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీన్ని బట్టి జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి రాజధాని ఏదో తెలియని పరిస్థితి ఉంటుందని చెప్పకనే సీఎం జగన్ చెప్పేశారు.

కాగా 2014 నుంచి 2019 కాలంలో అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు పోరాటం చేశారు. ఎక్కడెక్కడో తిరిగారు, ఎన్నోన్నో రాజధానులను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. కొంత మేర అయ్యాయి. కానీ అనూహ్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయారు. దీంతో రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఎప్పుడూ రాని వరదలు రాజధాని అమరావతికి వచ్చాయి. ప్రజా వేదిక కూలిపోయింది. ఎన్నోన్నో కుట్రలు తెరపైకి వచ్చాయి. రాజధానుల రైతుల త్యాగం ఎక్కడో కలిసి పోయింది. అమరావతి పేరు కనుమరుగయిపోయింది. ఐదేళ్ల పాటు మూడు రాజధానుల మాటే వినిపించింది. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని ఉంది. ఏపీకి మాత్రం ఒక్క రాజధాని కూడా లేకుండా పోయింది. దీంతో ఎన్నో విమర్శలు వినిపించాయి. రాజధాని లేని రాష్ట్రం ఏదంటే అన్ని వేళ్లు ఏపీ వైపే చూపించాయి. ఇప్పుడు సీఎం జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఈ విమర్శలే కంటిన్యూ అవుతాయి. కానీ ఈ ఎన్నికల్లో ఏపీ జనం తీసుకోబోయే నిర్ణయమే ఏపీకి రాజధానిని నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read More..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..వైసీపీ మేనిఫెస్టోలో మరికొన్ని కీలక అంశాలు



Next Story

Most Viewed