చీల్చి చెండాడండి... చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
చీల్చి చెండాడండి... చంద్రబాబు, పవన్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: 14 ఏళ్లు రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఏం చేశారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలో ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి మరోసారి దుష్టచతుష్టయం అంటూ కామెంట్స్ చేశారు. ఈ దష్టచతుష్టయంతో యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సభ ద్వారా సంకేతాలు పంపారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లే చంద్రబాబు అండ్ కో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల రణ క్షేత్రంలో చంద్రబాబుది కృష్ణుడి పాత్ర అని తనది అర్జునుడు పాత్ర అని అభివర్ణించారు. టీడీపీ, జనసేన పొత్తుల నుద్దేశించి దేవుడు, ప్రజలే తన తోడు బలం అని తెలిపారు. తమ కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతిగ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామ సచివాలయ ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో ఎప్పుడూ పేదలను పట్టించుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండని ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఒకటో తారీకున తెల్లవారుజామునే పెన్షన్లు అందిస్తున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు. వివక్ష లేని సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తాము తీసుకొచ్చామని తెలిపారు. టీడీపీ హయాంలో లంచాలు, వివక్షకు కేరాఫ్ అడ్రస్‌గా జన్మభూమి కమిటీలు మారాయని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో 10 శాతం అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. 66 లక్సల కుటుంబాలకు తాము సంక్షేమం అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఏనాడు కూడా పేదల అకౌంట్లలోకి ఒక్క రూపాయి కూడా వేయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపు నిచ్చారు.


Next Story

Most Viewed