కేంద్రమంత్రితో భేటీ అయిన సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |   (  Updated:2025-12-19 06:41:14  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) దిల్లీ పర్యటన (Delhi Visit) ప్రారంభమైంది.

కేంద్రమంత్రితో భేటీ అయిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) దిల్లీ పర్యటన (Delhi Visit) ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తదితరులున్నారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో వివిధ పనులకు సంబంధించి పెండింగులో ఉన్న అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని, నిధులు విడుదల చేయాలని విన్నవించారు.

2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – RRR పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించి పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని గుర్తు చేశారు.

ఇతర కేంద్రమంత్రులతో భేటీ

జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సీఎం సమావేశం అవుతారని అధికార వర్గాలు తెలిపాయి. నేటి తమ షెడ్యూల్ లో భాగంగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, సర్బానంద్ సోనోవాల్ ను కూడా సీఎం కలవనున్నట్లు పేర్కొన్నాయి. వారితో భేటీ అనంతరం దిల్లీలో జరగనున్న క్రెడాయ్ అవార్డుల కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని సీఎం కలుస్తారు. సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో భేటీ కానున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రానికి కావలసిన నిధులు, పెట్టుబడులకు క్లియరెన్స్, ప్రాజెక్టులకు అనుమతులతో పాటు పర్యావరణ క్లియరెన్స్ వంటి అంశాలపై కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Next Story