వేసవి రద్దీపై టీటీడీ స్పెషల్ ఫోకస్..ఏర్పాట్లు ఇవే..!

by Disha Web Desk 16 |
వేసవి రద్దీపై టీటీడీ స్పెషల్ ఫోకస్..ఏర్పాట్లు ఇవే..!
X

దిశ, తిరుపతి: తిరుమలలో వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చే మూడు నెలలకు సంబంధించిన సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఇప్పుడు ప్రత్యేక ప్రవేశ దర్శనంపై ప్రకటన చేసింది. జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు .. అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ ఇప్పటికే విడుదల చేసింది. ఇక శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటా టికెట్లను ఈ నెల 27న విడుదల కానున్నాయి. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ ..టీటీడీ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్లు పొందవచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్‌కు సంబంధించి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టోకెన్లను టీటీడీ ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇక వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ చెబుతోంది. శ్రీవాణి దర్శనాలను తగ్గించాలని నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలను నియంత్రించాలని కోరింది. మార్చి 30, 31వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి, శ్రీరామపట్టాభిషేకం ఆస్థానాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. మార్చి 30న హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి రద్దు చేసింది. మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.



Next Story

Most Viewed