Tirumala: దేశంలోనే తొలిసారిగా సరోగసి ద్వారా దూడ జననం

by srinivas |
Tirumala: దేశంలోనే తొలిసారిగా సరోగసి ద్వారా దూడ జననం
X

దిశ, తిరుపతి: దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీ గోశాలలో ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశావాళీ గోజాతులను అభివృద్ధి చేయాలని, గత ఏడాది ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గో జాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గో సంరక్షణ శాల మేలు జాతి ఆవుల నుంచి అండం సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేశారన్నారు . వీటిని టీటీడీ గోశాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా విజయం సాధించినట్లు ఈవో తెలిపారు. ఈ ప్రక్రియలో ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ధూప దీప నైవేద్యాలకు, నిత్య కైంకర్యాలకు అవసరమయ్యే పాలు, పెరుగు, వెన్న, నెయ్యిని దేశవాళీ ఆవుపాల నుండి ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే 200 దేశీయ గోవులను దాతలు సమకూర్చారని, మరో 300 గోవులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆవుల ఆరోగ్య పరంగా, అధిక పాల దిగుబడి దిశగా నాణ్యత కలిగిన దాణా తయారీ చేసుకోవడానికి ఇటీవలే గోశాలలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ప్రారంభించినట్లు చెప్పారు. అదేవిధంగా గోశాలలో రోజుకు సుమారు 3 వేల నుండి 4 వేల లీటర్ల ఆవు పాలను ఉత్పత్తి చేయనున్నట్లు ఈవో తెలిపారు. రోజుకు 60 కేజీ ల స్వచ్ఛమైన నెయ్యిని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసి స్వామి వారి నిత్య కైంకర్యం, నైవేద్యాలకు వాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రైతులకు టీటీడీ ఉచితంగా గోవులను అందిస్తోందని అన్నారు.

గోశాలలో ఉన్న షెడ్లలో మార్పులను చేయడం, ఇసుక తిన్నెలను ఏర్పాటు చేసి గోవులకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించామన్నారు. గోశాలలోనే కాకుండా తిరుపతి పరిసర ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పండించిన పచ్చి మేతను కొనుగోలు చేసేందుకు కలెక్టర్‌తో సంప్రదించామన్నారు. రానున్న రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు పొందేందుకు వీలుగా నూతన షెడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు టీటీడీ ఈవో వివరించారు.

Next Story

Most Viewed