TTD: జూన్ నెలాఖరు వరకు శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పూర్తి: వైవీ సుబ్బారెడ్డి

by Disha Web Desk 16 |
TTD: జూన్ నెలాఖరు వరకు శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ పూర్తి: వైవీ సుబ్బారెడ్డి
X

దిశ, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్‌లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అలిపిరి చెక్ పోస్ట్ వద్ద వాహనాల ఫిట్నెస్‌ను తనిఖీ చేసి కొండకు అనుమతించాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. అలిపిరి చెక్ పోస్టుతోపాటు శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణాలు, శ్రీనివాస సేతు నిర్మాణ పనులను గురువారం సాయంత్రం ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. తిరుమలకు వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి అధునాతన యంత్ర పరికరాలు ఏర్పాటుచేసే అంశంపై నివేదిక అందించాలని సీవీఎస్వో ను ఆదేశించామన్నారు. అలిపిరి చెక్ పోస్టులో వాహనాల తనిఖీలో ఆలస్యం జరిగి భక్తులు అసహనానికి గురి కాకుండా ఉండడం కోసం వాహనాల తనిఖీ క్యూలైన్ల సంఖ్యను పెంచనున్నట్లు ఆయన చెప్పారు. చెక్ పోస్టులో విజిలెన్స్ సిబ్బంది బాగా తనిఖీలు చేస్తున్నారని, తిరుమలకు వాటర్ బాటిల్లు తీసుకుని వెళ్లకుండా మరింత పటిష్టంగా తనిఖీలు చేయాలని సూచించారు.

చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గత ఏడాది డిసెంబర్లో పనులు ప్రారంభించారని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఈ ఏడాది చివర్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడం కోసం శ్రీనివాస సేతు నిర్మాణానికి టీటీడీ 65 శాతం నిధులు అందిస్తోందన్నారు.

గత ఏడాది డిసెంబర్‌కు ఫ్లైఓవర్ మొత్తం పూర్తికావాల్సి ఉన్నా, సాంకేతిక కారణాలవల్ల ఆలస్యమైందని చెప్పారు. జూన్ చివరి నాటికి పనులు పూర్తి చేసి జులైలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.


Next Story

Most Viewed