Tirumala: శ్రీవాణి నిధులపై దుష్ప్రచారం... టీటీడీ ఆగ్రహం.. చర్యలకు ఆదేశం

by Disha Web Desk 16 |
Tirumala: శ్రీవాణి నిధులపై దుష్ప్రచారం... టీటీడీ ఆగ్రహం.. చర్యలకు ఆదేశం
X

దిశ, తిరుమల: శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఏవీ ధర్మారెడ్డితో కలిసి మీడియా ప్రతినిధులకు వివరించారు.

సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం 2019లో టీటీడీ శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేసిందన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 26 జిల్లాలతోపాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్పీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2,445 ఆలయాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ ట్రస్టు నిధులతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల ధూపదీప నైవేద్యాలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. టీటీడీలో పూర్తి పారదర్శక పాలన జరుగుతోందని, ఇందుకు సంబంధించి మా పాలకమండలి టీటీడీ ఆస్తులపై 2021 జూన్‌ 21న, బంగారు, నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5వ తేదీన శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 300 పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని వైపీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆలయ కమిటీ బ్యాంకు అకౌంట్‌లో రూ.5 వేలు జమ చేయాలని తమ పాలకమండలి నిర్ణయించిందని తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉందని, అందులోనే విరాళాలు జమ అవుతాయని చెప్పారు. టీటీడీ నుంచి ఒక రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శ్రీవాణితోపాటు ఇతర ఏ ట్రస్టుల్లో అయినా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

ఈ విషయంపై 2023 జనవరి 23వ తేదీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి శ్రీవాణి ట్రస్ట్ నిధులు, ఈ నిధులతో నిర్మిస్తున్న, నిర్మించిన, నిర్మించబోయే ఆలయాల వివరాలు పూర్తిగా వివరించారని తెలిపారు. అయినా కొందరు పదే పదే ఆరోపణలు చేయడం శోచనీయమని విమర్శించారు. శ్రీవాణి టికెట్‌ తీసుకునే భక్తులకు ట్రస్టుకు విరాళం కింద రూ.10 వేలకు, దర్శనం టికెట్‌ కోసం రూ.500కు రెండు రసీదులు ఇస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్‌ బుక్‌ చేసుకున్నా రెండు రసీదులు వస్తాయన్నారు. రూ.500కు మాత్రమే రసీదు ఇచ్చి మిగిలిన రూ.10 వేలు దోచుకుంటున్నారని, కొందరు వ్యక్తులు రాజకీయ, వ్యక్తిగత లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Also Read,,

Breaking: ‘వ్యూహం’పై దూకుడు.. కాసేపట్లో సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ



Next Story

Most Viewed