Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అద్భుత అవకాశం

by Disha Web Desk 16 |
Tirumala: భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి అద్భుత అవకాశం
X

దిశ, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు తిరుపతి నగర వాసులకు అదిరిపోయే న్యూస్ ఇది.. తిరుపతి చుట్టుపక్కల అందాలను ఆకాశం నుంచి తిలకించేందుకు అద్భుత అవకాశం అందుబాటులోకి వచ్చింది. ‘ఏరో డాన్’ అనే సంస్థ తీసుకు వచ్చిన జాయ్ రైడ్‌‌ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానంద రెడ్డితో కలసి హెలికాప్టర్ ఎక్కి చంద్రగిరి కోట వరకు వెళ్లి వచ్చారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి పోలీస్ గ్రౌండ్ నుంచి ప్రారంభమయ్యే జాయ్ రైడ్ వల్ల తిరుపతి, చంద్రగిరి చుట్టు ప్రక్కల ప్రదేశాలను విహంగ వీక్షణం చేయొచ్చని, నాలుగు రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తారని వెల్లడించారు. ఆరు సీట్ల కెపాసిటీ వున్న హెలికాప్టర్‌లో పైలట్ కాకుండా ఐదుగురు పర్యాటకులు ఎక్కేందుకు అవకాశముందన్నారు. చంద్రగిరి కోట అందాలను ఆకాశం నుంచి తిలకించే అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఏరోడాన్ సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి చంద్రగిరి పోర్టు వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తామని, ఈ రైడ్ కేవలం 8 నిమిషాల్లోనే పూర్తవుతుందని, ఒక గంటకు ఆరు రైడ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.6 వేలు వసూలు చేస్తున్నట్లు వివరించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే వేలాది మంది భక్తులతో పాటు తిరుపతి వాసులకు చుట్టు పక్కల అందాలను ఆకాశం నుంచి చూపించాలనే మంచి ఉద్దేశంతోనే ఈ రైడ్ ప్రారంభిస్తున్నట్లు ఏరో డాన్ ప్రతినిధులు చెప్పారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే రైడ్ సక్సెస్ అయితే తిరుపతి టు చెన్నై మార్గంలో కూడా ప్రవేశపెట్టే ఆలోచన ఉందని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed